
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తిచూపుతున్నామని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాప క్ష ఉపనేత హరీష్రావు అన్నారు. గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం టిడి పి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆక్షేపించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. సిడబ్ల్యూసి మీటింగ్కు వెళ్లటం లేదంటూనే.. ఎపి డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు.ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ ఎజెండా మొదటి అంశం… పోలవరం -నల్లమలసాగర్ ప్రాజె క్టు అని, ఎజెండాలో నల్లమల సాగర్ లేకపోతేనే మీటింగ్కు వస్తామని చెప్పి, తర్వాత వెళ్లి తెలంగాణ ను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య గో దావరి జలాల పంపిణీయే జరగలేదని సీడబ్ల్యూసీ సమావేశంలో జీఆర్ఎంబీ చెప్పిందని చెప్పారు. జ లాల పంపిణీ జరగలేదని జీఆర్ఎంబీ ఎలా చెబుతుంది..? అని ప్రశ్నించారు. గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారని అడిగారు.
గోదావరి బేసిన్లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బిఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని తెలిపారు. తాము ప్రతిపక్షంగా నిలదీసిన ప్రతిసారీ ఉలిక్కిపడి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోందని విమర్శించారు. తాను ఇప్పుడు మీడియా సమావేశం నిర్వహించాను కాబట్టి మళ్లీ ఏదైనా లేఖ రాసే డ్రామా ఆడుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని లేఖలు రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరాం : హరీష్రావు చిట్చాట్
ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరామని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. తాము మాట్లాడుతుంటే సిఎం,సంబంధిత శాఖా మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పామని పేర్కొన్నారు. సిఎంపై బిఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్కు చెప్పామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం హరీష్రావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ నెల 30 వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పిందని, అందులో రెండు ఆదివారాలు, రెండు పండుగలు పోతే అసెంబ్లీని ఎన్ని రోజులు నడుపుతారని అడిగారని అన్నారు. కచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని చెప్పామని తెలిపారు.అలాగే ఆదివారాలు అసెంబ్లీ పెట్టాలని కోరామని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు సభ నడుపుతామని అన్నారని,
తాము కనీసం ఈనెల 31వ తేదీ వరకు సభ పెట్టాలని అడిగితే, సిఎంతో మాట్లాడి చెప్తామని అన్నారని చెప్పారు. ఈనెల 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పిందని, 22వ తేదీ ఆదివారం అసెంబ్లీ ఉంటుందని అన్నారు. హౌస్ కమిటీలు ఆలస్యం అయ్యాయని చెబితే, త్వరలోనే హౌస్ కమిటీలు వేస్తామని చెప్పారని తెలిపారు. మంగళవారం(మార్చి 17) అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకపోవడంపై ప్రశ్నించామని చెప్పారు. అన్ స్టార్డ్ క్వశ్చన్స్, జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు రాలేదని అన్నారు. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బిఆర్ఎస్ తరపున అడిగామని పేర్కొన్నారు. అసెంబ్లీని ఉదయం 9 గంటలకు పెట్టాలని బిఎసి సమావేశంలో డిమాండ్ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ను పెట్టలేదని అడిగామని అన్నారు. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్ అని, ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ భాద్యత తీసుకోవాలని అడిగామని తెలిపారు.




