
బి25 బాంబర్ విమానంతో దాడికి దిగిన అగ్రరాజ్యం
తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపిస్తున్న
అమెరికా విమానాలు ఇరాన్ అణుకేంద్రం ఉన్నది
ఈ నగరంలోనే టెహరాన్లోని స్పేస్ సెంటర్పైనా దాడులు
షిరాజ్ నగరంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ గల్ఫ్
దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడి అమెరికా, ఇజ్రాయెల్,
వాటి మిత్రదేశాలకు హర్మూజ్ ప్రవేశం లేదు ఇరాన్ స్పష్టీకరణ
దుబాయ్: మధ్యప్రాచ్య, గల్ఫ్ పోరు ఆదివారం మరింత తీవ్రతరం అయింది. ఇరాన్లోని అత్యంత కీలకమైన అణుకేంద్రం ఉన్న చారిత్రక ఇస్ఫమాన్ నగరంపై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఆదివారం తెల్లవారుతూనే సంయుక్త బలగాల వైమానిక దాడులు వీడకుండా సాగాయి. భారీ పేలుళ్లు, నల్లని దట్టమైన పొగలతో నగర జనం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇరాన్ నాయకత్వానికి సవాళ్లు విసురుతూ దాడులను ఉధృతం చేయాలనే ట్రంప్ ఆదేశాలతో యుఎస్ ఆర్మీ కమాండ్ రంగంలోకి దిగింది. ఈ నగరంలో తక్కువ ఎత్తులోనే యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. ప్రత్యేకించి అణుకేంద్ర స్థావరం అయినందునే ఈ నగరంపై దాడులకు దిగినట్లు వెల్లడైంది. అయితే అణు కేంద్రానికి ఏమైనా నష్టం జరిగిందా? అనేది వెంటనే వెల్లడికాలేదు. మరో వైపు టెహరాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇరాన్ స్పేస్ సెంటర్పై కూడా దాడులు జరిగాయి. ఇక్కడి నుంచే ఇరాన్ అత్యంత కీలకమైన శాటిలైట్ మ్యాపింగ్ సమాచారాన్ని తన సైనిక శ్రేణులకు, ఇంటలిజెన్స్ వ్యవస్థలకు పంపిస్తుంది.
మరో వైపు ఇరాన్పై ఇప్పటి దాడులకు అమెరికా ఇప్పుడు తమ అత్యంత శక్తివంతమైన బి25 బాంబర్ విమానాన్ని పంపించిందని నిర్థారించారు. ఈ విమానం ద్వారా ఒకేసారి అత్యధిక స్థాయిలో 38 టన్నుల బాంబులను తీసుకువెళ్లవచ్చు. వీటిని తరలిస్తున్న దృశ్యాలను అమెరికా సైనిక విభాగం విడుదల చేసింది. టెహరాన్ ఎయిర్పోర్టు వద్ద భారీ స్థాయిలో 20 నిమిషాల వ్యవధిలోనే 20 సార్లు బాంబు పేలుళ్లు విన్పించాయి. అయితే ఇరాన్ సైనిక వర్గాలు ఇస్ఫహాన్, టెహరాన్లపై దాడుల గురించి పెద్దగా స్పందించలేదు. ఇరాన్లోని షిరాజ్ నగరం నివాసిత ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. పేదలు, శ్రామికులు ఎక్కువగా ఉండే ఈ నగరంపై దాడులతో ఇక్కడి వర్కర్ల గృహసముదాయాలు, అక్కడి సహాయక సంస్థల కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకూ జరిగిన దాడులలో ఇరాన్లో దాదాపు 1500 మంది వరకూ పౌరులు మృతి చెందారు. వీరిలో 223 మంది మహిళలు, 202 మంది పిల్లలు ఉన్నారని ఇరాన్ సంస్థలు తెలిపాయి.
అరబ్ దేశాల ఆస్తులు , స్థావరాలపై నేరుగా ఇరాన్ దాడులు
తమ దేశానికి అత్యంత కీలకమైన ఖర్గ్ దీవిపై అమెరికా దాడుల పట్ల ఇరాన్ రగిలిపోతోంది. ఇందుకు అవసరమైన స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ దీవిపై దాడులతో ఇరాన్కు భారీ స్థాయిలో చమురుపరమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. ఖర్గ్ దీవిపై అమెరికా దాడులకు అరబ్ దేశాలలోని పలు రేవులు, డాక్లు, రహస్య స్థావరాలను అమెరికా విరివిగా వాడుకుందని ఇరాన్ పసికట్టింది. మిత్రదేశాలు ఈ విధంగా తమపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం, అమెరికాకు వంత పాడటంతో ఇరాన్ ఆయా దేశాలను ఎంచుకుని వరుసగా దాడులు తీవ్రతరం చేసింది. ఆదివారం ఉదయం నుంచి తమ భూభాగంలో ఇరాన్ దాడులు జరిగాయని గల్ఫ్ దేశాలు తెలిపాయి. ఇప్పటికే యుఎఇలోని మూడు అత్యంత ప్రధాన రేవులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా రక్షణ కవచాలుగా ఈ ప్రధాన రేవులు పనిచేస్తున్నాయని ఇరాన్ గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలకు హర్మూజ్ ప్రవేశం లేదని, దీనిని ప్రకటించామని, అయితే పలు దేశాలు తమ మీమాంసతో ఈ అవకాశం వాడుకోవడం లేదని, దీనితో తమకు సంబంధం లేదని తెలిపారు. మరో వైపు బాగ్దాద్లోని అమెరికా ఎంబసీ కాంపౌండ్లోపలి హెలిపాడ్పై క్షిపణి దాడి జరిగింది. ఆదివారం జరిగిన దాడికి ఇంతవరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.




