
హైదరాబాద్: మూసి నది ప్రక్షాళన పూర్తైతే ఆ ప్రాజెక్టులో గల్లంతు అవుతామని కెటిఆర్ భయపడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎంఎల్ఎలు సామేలు, నాగరాజులతో కలిసి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కెటిఆర్ చిట్ చాట్ పేరిట చెత్త మాటలు మాట్లాడుతున్నారని, ఐఎఎస్, ఐపిఎస్ లను కెటిఆర్ భయపెడుతున్నారని విమర్శించారు బ్యూరోక్రసిని పట్టుకొని మీ పేర్లు పింక్ బుక్, ఆరేంజ్ బుక్, రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నామని భయపెడుతున్నాడని అన్నారు.
తమ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారికి ఇబ్బంది కలుగకుండా వారి సూచనలు తీసుకుంటూ ముందుకు పోతున్నామని, తమ కుటుంబ గొడవల ఫ్రస్టేషన్ను కెటిఆర్ అధికారులపై తీస్తున్నారని చెప్పారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి డ్రగ్స్ పరీక్షలకు నమూనాలు ఇవ్వడానికి సిద్ధం కావాలని ఆయన చెప్పారు. కెటిఆర్ పైలెట్ రోహిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.




