
న్యూఢిల్లీ: ఏ దశలో అయినా ప్రపంచం ఇప్పుడు ఇంధన అవసరాల వలయంలో చిక్కుకుంది. అ యితే మధ్యప్రాచ్య యుద్ధం తీవ్రతరం, హర్మూజ్ జలసంధిపై చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలతో పలు దేశాలకు చిక్కులు ఏర్పడుతున్నా యి. ఈ అత్యంత క్లిష్టమైన దశలోనే భారతదేశాని కి భారీ క్రూడాయిల్ లోడ్తో లైబిరియా దేశపు జెండాతో బయలుదేరిన నౌక స్యూజ్మాక్స్ ట్యాం కర్ షెన్లాంగ్ ఈ అత్యంత ప్రమాదకరమైన సము ద్ర మార్గం ద్వారానే నిర్ణీత గమ్యం అయిన ముం బై పోర్టులోని జవహర్ ద్వీప్ టర్మినల్కు చెక్కుచెదరని రీతిలో క్షేమంగా చేరింది. ఇంతకూ ఈ చమురు ట్యాంకర్ నౌకకు భారతీయుడే క్యాప్టెన్గా ఉన్నాడు. ఇరాన్ దాడులకు గురి కాకుండా చేసుకునేందుకు ఈ నౌక ఈ జలసంధి దాటేంత వరకూ డార్క్లోకి వెళ్లింది. సాధారణంగా ప్రతి నౌక ప్రయాణం , కదలికలను తెలియచేసేందుకు తనంతతానే పనిచేసే ఆటోమోటిక్ ఐడెంటిఫికేషన్ సిస్థమ్ (ఎఐఎస్) అమర్చి ఉంటుంది. ప్రత్యేకించి చమురు రవాణా నౌకలకు దీనిని ఖచ్చితంగా అమరుస్తారు. దీని వల్ల నౌక గుర్తింపు,
ఇది ఏ ప్రాంతంలో ఉన్నది ? వేగం ఇతర వివరాలు ఇతర నౌకలకు , పర్యవేక్షక సాంకేతిక అధికారుల బృందానికి తెలుస్తాయి. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలు, చమురు నౌకలు జలసంధిలో కనబడితే చాలు , పేల్చేస్తాం, కూల్చేస్తాం అనే ఇరాన్ బెదిరింపుల మధ్య ఇప్పుడు ఈ షెన్లాంగ్ డార్క్లోకి వెళ్లింది. అంటే గమనం తెలిపే ఎఐఎస్ స్విచ్ఛాఫ్ చేసేసి , కొద్ది దూరం ఈ విధంగా ప్రయాణించి చివరికి ముంబై రేవుకు చేరుకుంది. సౌదీలోని రాస్ టనూరా పోర్టు నుంచి బయలుదేరి క్షేమంగా భారత్కు చేరడం రికార్డు అయింది. నౌక జాడతెలియకుండా చేసుకుని, సముద్రంలో ప్రయాణించడం ద్వారా గమ్యం చేరుకుంది. మార్చి 1వ తేదీన సౌదీ నుంచి బయలుదేరిన తరువాత మధ్యలో రెండు మూడురోజుల వరకూ అదీ కూడా హర్మూజ్ జలసంధి మార్గం వద్దనే సిగ్నల్ లేకుండా పోయింది. దీనితో నౌకాయాన నియంత్రణ వ్యవస్థలు నివ్వెరపోయాయి. అయితే ఎంతో రిస్క్తో కూడిన గోయింగ్ డార్క్ ప్రక్రియతో భారతీయ కెప్టెన్ దీనిని ముంబై రేవుకు చేర్చడం కీలక పరిణామం అయింది.
ఆషామాషీ నౌక కాదు..
1,35,335 టన్నుల క్రూడాయిల్ సరుకు
సౌదీలో లోడ్ అయిన ఈ నౌకలో మొత్తం 1,35,335 టన్నుల ముడిచమురు ఉంది. హర్మూజ్ జలసంధి మార్గంలో జాడ తెలియకుండా వచ్చిన నౌక తిరిగి మారిటైం డాటా సంస్థ లాయడ్ లిస్ ఇంటలిజెన్స్కు, ట్యాంకర్ ట్రాకర్ల దృష్టికి ఈ నెల 9న చిక్కింది. అప్పటికీ ఈ నౌక సరుకుతో ముంబై తీరంలో ఉంది. ఈస్టర్న్ ముంబైలోని మహులూలోని రిఫైనరీలకు ఈ చమురు అందుతోంది.
ప్రతి నౌకా ఎఎస్ఐ వాడాల్సిందే ..అత్యవసరమైతే తప్పితే
నౌకల గుర్తింపు, కదలికల వివరాలను తెలిపే ఎఐఎస్ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ నిబందనల మేరకు ఖచ్చితంగా ప్రతి సరుకు రవాణా నౌకకు ఉండాల్సిందే. దీని ద్వారా అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. కానీ ఘర్సణలు, సముద్ర జలాల్లో పోరు ఇతర పరిస్థితుల మధ్య ఈ పరికరాన్ని పనిచేయకుండా చేసుకునే అసాధారణ అవకాశం ఉంటుంది. దీనిని గో డార్క్ అని వ్యవహరిస్తారు. ఏ దేశపు నౌక అయినా ఇరాన్ ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతనే హర్మూజ్ జలమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. బుధదారం మయూరి నారీ నౌక గుజరాత్లోని కాండ్లా పోర్టుకు
థాయ్ జెండాతో బయలుదేరినప్పుడు హర్మూజ్లో దాడికి గురైంది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో భారతీయ నావికులు ఇద్దరు మృతి చెందారు. అప్పటి నుంచి మరో భారతీయుడు జాడ తెలియకుండా పోయ్యాడు. తమ ముందస్తు అనుమతి లేకుండానే నౌక కదలిందని, దాడికి గురైందని ఇరాన్ తెలిపింది. ఇక పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ జెండాలతో కూడిన చమురు నౌకలు సిద్ధంగా రవాణాకు ఉన్నాయి.వీటిలో 24 హర్మూజ్కు పశ్చిమాన ఉన్నాయి. వీటిలో మొత్తం 677 మంది భారతీయ నావికులు విధుల్లో ఉన్నారు. మరో వైపు ఈ జలసంధి తూర్పున నాలుగు నౌకలు ఉన్నాయి. వీటిలో 101 మంది భారతీయ నావికులు ఉన్నారు.
హర్మూజ్ రవాణా సాఫీకి దౌత్యం
ఇరాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు
గల్ఫ్ యుద్ధం, హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాకు ఆటంకాల దశలో బారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గడిచిన కొద్దిరోజుల్లో ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో మూడుసార్లు మాట్లాడారు ఈ విషయాన్ని విదేశాంగ కార్యాలయ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. గల్ఫ్ యుద్ధ ప్రభావం క్రమేపీ దేశంలో చమురు నిల్వలపై పడుతోంది. సముద్ర మార్గాలలో నౌకారవాణాకు ఆటంకాలు చిక్కులకు దారితీస్తున్నాయి. ముంబై తీరానికి భారీ లోడ్తో సౌదీ నుంచి చమురు నౌక చేరుకున్న తరువాత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. కాగా భారతీయ నౌకలకు, ప్రత్యేకించి భారతీయ జెండాతో ఉన్న రవాణా నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా కదిలేందుకు అనుమతి ఇస్తుందని ఇరాన్ ప్రకటించింది. అయితే వాస్తవికంగా కొన్ని నౌకలు విదేశీ సంస్థలకు చెందినవి కావడం, భారతదేశానికి చేరుకోవల్సి ఉండటం, నౌకలపై ఎగిరే జండాలు వంటి విషయాలలో పలు క్లిష్టతలు తలెత్తుతున్నాయి. ఈ దశలో సంక్లిష్టతల తొలిగింపు దశలో జైశంకర్ ఇరాన్ మంత్రితో మాట్లాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అత్యంత కీలకమైన ఈ విషయంపై వివరాలు కొన్ని పూర్తిగా వెల్లడించలేమని కూడా స్పష్టం చేశారు.




