
మన తెలంగాణ/బాన్సువాడ: కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రగిలిపోతున్నారు. ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు నిధుల మంజూరు చేసే విషయంలో లోలోపల మదన పడుతున్నారు. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని పరిశీలించడానికి ఆయన ప్రాజెక్టు సైట్కి వెళ్లారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో తీరా అసహనానికి గురయ్యారు. ఈ వయసులో తాను నిధులు మంజూరు చేయాలని ‘కాళ్లు మొక్కాల’ అని, టీఆర్ఎస్ హయాంలో కూర్చుంటే జీవోలు వచ్చాయని, సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్యాహం నుంచి రాత్రి 10 గంటల వరకు బైటాయించారు. మంత్రుల మీద హాట్ కామెంట్స్ చేశారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్లు చేసినా లేపడం లేదని, సీఎంకు 20 సార్లు ఫోన్చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఇప్పటివరకు నేనెప్పుడూ చూడలేదన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటోనని ప్రశ్నించారు. పైస్థాయి అధికారులు పోచారంను రెండు రోజులు వేచిచూద్దామని రిక్వెస్ట్ చేయడంతో పోచారం ఇంటికి వెళ్లారు.




