
న్యూఢిల్లీ ః పశ్చిమాసియా సంక్షోభ నివారణకు దౌత్యం, చర్చలు అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. చమురు సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధి ఆటంకాలు ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి గల్ఫ్ యుద్ధం తీవ్ర ప్రకంపనలకు దారితీసింది. ప్రజల నిత్యావసరమైన వంటగ్యాస్, చమురు సరఫరాలపై ప్రభావం పడింది. ఆర్థిక వ్యవస్థలకు విఘాతం ఏర్పడుతోంది. ఈ అంతర్జాతీయ ప్రభావిత అంశంపై ప్రధాని లోక్సభలో సోమవారం ప్రస్తావించారు. ఏ సమస్యకు అయినా యుద్ధం పరిష్కారం కాదు. ఘర్షణలతో సమస్యలు మరింత ప్రజ్వరిల్లుతాయని, పరిస్థితి చేయి దాటుతుందని హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధి మార్గం అత్యంత కీలకం. ఈ దారిలో వాణిజ్య నౌకలను అడ్డగించడం అనుచితం. అదే విధంగా ఈ ప్రాంతాన్ని దెబ్బతీయాలనుకోవడం కూడా విచక్షణారహితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజల చమురు, గ్యాసు అవసరాల విషయంలో ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్షం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ఇంధన అవసరాలను తీర్చేందుకు మన దేశం సరఫరాదార్లతో సంప్రదింపులు జరుపుతోంది. సరుకు సక్రమంగా చేరేందుకు వీలు కల్పిస్తోందని హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ దశలో ప్రధాని మోడీ తొలిసారిగా దేశ ప్రజలకు పరిస్థితిని లోక్సభలో సమగ్ర ప్రకటన ద్వారా వెలువరించారు.
ఇంధన నిల్వలపై సమీక్ష..ఆహార భద్రతకు సంసిద్ధం
ఇప్పటి యుద్ధం కేవలం సంబంధిత పక్షాల సంబంధితం కాదు. దీని ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. ప్రత్యేకించి చమురు సరఫరాల వ్యవస్థ దెబ్బతింటోంది. దీనిని గుర్తించి , పలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధన సరఫరా జరిగేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రధాని తెలిపారు. దేశంలో ఇప్పుడు అన్ని విద్యుత్ కేంద్రాలకు అవసరం అయిన బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహర సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నాం. ఆహార భద్రత విషయంలో అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. శాంతియుత పద్ధతుల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. సంక్షోభాలకు దారితీయరాదనేదే భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని వివరించారు.




