
మన తెలంగాణ/ నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఒకే సారి 15 మంది పిల్లలు అస్వస్థులయ్యారు. వెనకా ముం దు చూసుకోకుండానే హడావుడిగా నీళ్లు, ఫ్లూ యిడ్ను ఎక్కించడంతో అది కాస్త వికటించి బాధిత చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి వర్గా ల్లో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్షాన్ని బయటికి పొక్కకుండా శతవిధాలా ప్రయత్నించారు. తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ఆఘ మేఘాలమీద చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించారు. ఫ్లూయిడ్ ఎక్కించన తర్వాతే పిల్లలు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వైద్యులు అనారోగ్యపాలైన రోగులకి ఎలాంటి సమస్యలు రాకుండా దగ్గరుండి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఏలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
దీనికి కారకులను గుర్తించే పనిలో అధికారులు రంగంలోకి దిగారు. వివిధ జిల్లాల నుంచి ఇన్ఫెక్షన్లు సోకి ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యారు. వారిని కొత్త బ్లాక్లో వివిధ వార్డుల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరి నిర్లక్షం వల్లనే పిల్లలు అస్వస్థలకు కారణమని పలువురు చెబుతున్నారు. పిల్లలకి ఫ్లూయిడ్ ఎక్కించడంలోను ఆజాగ్రత్తల వల్లనే వికటించి పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్నది. వారికి ఒక్కసారిగా వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు రావడం పిల్లల తల్లిదండ్రులు, సహాయకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి నర్సుల వల్లనే తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఫ్లూయిడ్ వికటించడం, పిల్లలు అస్వస్థులు కావడాన్ని ఆస్పత్రి ఉన్నత వర్గాలు తీవ్రంగా పరిగణించారు. సిబ్బంది నిర్లక్షం, తప్పిదాల వంటివి నిగ్గు తేల్చేందుకు విచారణకి ఆదేశించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
పిల్లల పరిస్థితి నిలకడగా ఉంది : ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆచార్య విజయకుమార్
ఆస్పత్రిలో పిల్లల పరిస్థితి మెరుగ్గా ఉందని, వారు త్వరంగా కోలుకుంటున్నారని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య విజయకుమార్ తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పటికే నలుగురిని డిశ్చార్జి చేశామని, మిగతా వారి పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వారిని కూడా ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపిస్తామని విజయకుమార్ వివరించారు. చిన్న సమస్యను పెద్దదిగా చేయడం, వదంతులు, పుకార్లు వ్యాపింపచేయడం శ్రేయస్కరం కాదన్నారు.




