
న్యూఢిల్లీ : కరూర్ తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తునకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ను, సిట్ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ఆ హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోందని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు జస్టిస్జేకె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిస్రోయిలతో కూడినధర్మాసనం మద్రాస్హైకోర్టుపై అనుమానాలు వ్యక్తం చేసింది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కు చెందిన తమిళగ వెట్ట్రి కజగమ్ (టివికె) సెప్టెంబర్ 27న కరూర్వద్ద నిర్వహించిన ర్యాలీలో 41 మంది మృతి చెందిన సంఘటనపై సుప్రీం కోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. దేశాన్ని కుదిపేసిన ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆకాంక్షించింది.
ఈ సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని టీవీకే అభ్యర్థన మేరకు సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి త్రిసభ్య కమిటీని నియమించింది. అయితే తొక్కిసలాటపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నై బెంచ్లో ఏదో తప్పిదం జరుగుతోందని , కోర్టు అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రార్ జనరల్ అందించిన నివేదికను కక్షిదారులతో పంచుకుని వారి స్పందన తీసుకోవాలని ఆదేశించింది.




