Monday, December 1, 2025
Google search engine
HomeUncategorizedనకిలీ ఎసిబి ముఠా పట్టివేత

నకిలీ ఎసిబి ముఠా పట్టివేత

ఎసిబి డిఎస్‌పి అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి సోమవారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో నకిలీ ఎసిబి ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లా, వేలమద్ధి గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాస్, అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు తో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఠా సభ్యులు హరి జిల్లాకు చెందిన నవీన్ జేఆర్, బెంగళూరుకు చెందిన మంగళ రవీందర్, మురళి, ప్రసన్నలను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ శాఖలలో ఉన్నతాధికారులతో పాటు పదవీవిరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వారికి ఏసిబి డి.ఎస్పీనంటూ ఫోన్ చేసి..‘మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేయడం జరిగింది, ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి ఉంటుంది’ అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఎసిబి డిఎస్పీ నంటూ బెదిరించి సుమారు 9 లక్షల 96 వేల రూపాయలను వివిధ మార్గాల్లో దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, అతనికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 2002 సంవత్సరంలో మొదట ద్విచక్ర వాహనం చోరీతో దొంగతనాలకు శ్రీకారం చూట్టాడు. మరికొద్ది రోజులకు నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతములో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకొని వారి వద్ద దొంగ సొత్తు దాచి ఉంచారని బెదిరించి వారి నుండి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడ్డాడు. ఇతను సుమారు 50 కేసుల్లో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలులో నిందితుడు తన వ్యవహార శైలిని మార్చుకోకుండా జైలు నుండి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటంతో పోలీసులు మరోమారు నిందితుడి అరెస్టు చేసి జైలుకు తరలించారు .

నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం మళ్ళీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఎసిబి డిఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదై ఉన్నాయి. సుమారు రూ.50 లక్షలు పైగా దోపిడీకి పాల్పడగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 9 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 8 కేసుల్లో అరెస్ట్ కాగా, మిగిలిన 11 కేసుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్ కాలనీతో పాటు 2021 సంవత్సరంలో స్టేషన్ ఘన్పూర్, కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తితో పాటు ఆంధ్రలోని కర్నూల్ జిల్లాలో జరిగిన నేరాలలో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

బెదిరింపులకు పాల్పడుతూ దోచేసిన డబ్బును నిందితుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారణలో వున్న మిగతా నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న నిందితులతో కలసి ఆన్లైన్ బెట్టింగ్, గోవాలో కాసినోలలో జూదం ఆడటంతో పాటు గోవా, బెంగుళూరు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి డి.కవిత, వరంగల్ ఎసిపి ఎన్. శుభం ప్రకాష్, టాస్క్‌ఫోర్స్ ఎసిపి ఏ. మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఎస్.ఐ లు ఎస్. మహేష్, ఎం. సురేష్‌లను, టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పి.ఎస్. సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments