
హైదరాబాద్: హామీలు ఏం అమలు చేశారో సిఎం రేవంత్ రెడ్డి చెప్పరు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల గురించి రేవంత్ రెడ్డి ఒక్కమాట మాట్లాడరు అని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని, బిజెపి, బిఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై, బిజెపిపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేశారు అని రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా.. భయపడను అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ తనకు అవసరం లేదు అని తెలంగాణ అభివృద్ధికి బిజెపి ఏం చేసిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి బిజెపి అవినీతి కుటుంబ పార్టీ కాదు అని ఇచ్చిన హామీలు అమలు చేయడమే బిజెపికి తెలుసు అని పేర్కొన్నారు. తమ పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు అని ఫేక్ వీడియోలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్లు అవినీతిని బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పారు అని అన్నారు.
రూ. లక్ష కోట్లు కాదు కదా.. రూ. లక్ష కూడా వెలికి తీయలేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది అని అన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఎదొస్తే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, భూముల కుంభకోణం కేసులు ఏమయ్యాయి? అని రేవంత్ రెడ్డి మాటలను మంత్రులైనా నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ దగా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ. వేల కోట్లు వసూలు చేస్తోంది నిజం కాదా? అని ఇక్కడ వసూలు చేసి.. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపడం వాస్తవం కాదా? అని నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించేందుకు మనసు రాదా? అని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ కు తాను అడ్డుబడుతున్నానని తనపై నిందలు వేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి అసలు ఆర్ఆర్ఆర్ పై అవగాహన లేదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు.
తెలంగాణ అభివృద్దిపై తన వివరణను వినే ధైర్యం మాజీ సిఎం కెసిఆర్, రేవంత్ రెడ్డికి ఉందా? అని కెసిఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ హైకమండ్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు భయపడి రేవంత్ రెడ్డి..కెసిఆర్ పై చర్యలు తీసుకోవట్లేదు అని రేవంత్ రెడ్డిది ఫేక్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమని విమర్శించారు. గతంలో కెసిఆర్ ది ఫ్రాడ్, ఫేక్, ఫాల్స్, ఫ్యామిలీ గవర్నమెంట్ అని మిగులు బడ్జెట్ తెలంగాణను కెసిఆర్, రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీని పెంచి పోషించి.. వాళ్ల కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.




