
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు పంచి, తానే ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ల క్షా 64 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించామని అన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చింది బిఆర్ఎస్, పరీక్ష పెట్టింది బిఆర్ఎస్, ఫిజికల్ టెస్టు పెట్టింది బిఆర్ఎస్, ఎంపిక చేసింది బిఆర్ఎస్ అయితే… నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5 వేలు మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణ నిరుద్యోగ జెఎసి అధ్వర్యంలో శుక్రవారం
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో నిర్వహించిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపి ఆర్. కృష్ణయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బిఆర్ఎస్ నేతలు ఏనుగుల రాకేష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ నిరుద్యోగ జెఎసి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి హరీష్రావు కాం గ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని సవాల్ విసిరారు. రేవంత్రెడ్డిని బట్టలూడదీసి ఊడగొడుతారని, ఆయన అసలు రంగు బయటపడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని అన్నారు.
ఎన్నికల ముందు నిరుద్యోగులను రేవంత్ రెడి వేడుకున్నారని, వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చెయ్యి చూపించి నిరంకుశంగా అణచివేస్తున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అని జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేశారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి బోగస్ అని మండిపడ్డారు. రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తామన్న మాటలు, హామీలు బోగస్ అయ్యాయని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఒక అవకాశం వచ్చింది
రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని హరీష్ రావు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. తనతప్పు తాను తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించాలని అన్నారు.
జిఒ 29, జిఒ 55పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని చెప్పారు. భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు..గల్లా పెట్టెలు నింపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అని, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.




