
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తీవ్రవాద సంస్థ తెహ్రీక్ – ఎ- లబ్బాయిక్ పాకిస్తాన్ (టిఎల్ పి) కి చెందిన లక్షలాది మంది గాజా హత్యాకాండను నిరసిస్తూ, ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయానికి మార్చ్ చేసేందుకు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు భద్రతాదళాలు ఇస్లామాబాద్ కు వెళ్లే ప్రధాన దారులలో బారికేట్లు నిర్మించకుండా ఏకంగా ఫిస్పింగ్ కంటైనర్లను అడ్డంగా పెట్టి దిగ్బంధించాయి. మొబైల్ సేవలను నిలిపివేశారు. లాహోర్ లోనూ ఈ మార్చ్ కు యత్నించినవారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిఎల్ పీ ప్రతిఘటన హింసాత్మక ఘర్షణకు దారితీసింది. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు.
పాక్ భద్రతా దళాల అణచివేతలకు నిరసనగా టిఎల్ పి ఇస్లామాబాద్ కు మార్చ్ చేపట్టింది. లక్షలాది మంది నిరసన కారులు ఇస్లామాబాద్ శివారు లోని అమెరికన్ మిషన్ వద్ద మోహరించారు. ఇస్లామాబాద్ లోని రెడ్ జోన్ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, అనేక హోటళ్లను ఖాళీ చేయించారు.పాకిస్తాన్ అంతటా నిరసనలు కొనసాగుతున్నందువల్ల ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం, లాహోర్, కరాచీ, పెషావర్ లోని అమెరికా కాన్సులేట్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, పౌరులు ఈ ప్రాంతాలలో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని భద్రతా దళాలు హెచ్చరికలు జారీ చేశాయి.




