ఎపిలోని విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ ఇంట్లో వృద్ధురాలు, ఆమె మనవడిని బంధించిన దొంగలు నగదు, బంగారం అపహరించారు. మొత్తం13 తులాల బంగారం, 3 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న కారు తాళం తీసుకొని కారుతో సహా ఉడాయించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్లో ఎల్లయమ్మ, ఆమె మనవడు కృష్ణ కాంత్ నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఇంటి వెనుక వైపు నుంచి ముగ్గురు దొంగలు ఎల్లయమ్మ ఇంట్లో చొరబడ్డారు. ఎల్లయమ్మ బెడ్ రూమ్లో నింద్రించగా, మనవడు హాల్లో పడు కున్నాడు. ముఖాలకు మాస్కులు పెట్టుకుని ఉన్న ముగ్గురు దుండగులు ముందుగా దొంగలు ఎల్లయమ్మ వద్దకు వచ్చి ఆమె రెండు చేతులు కట్టేశారు. అనంతరం అరవకుండా ముఖానికి ప్లాస్టర్ అంటీంచారు. ఆమె చేతికి ఉన్న బంగారు గాజులన్నీ తీసుకున్నారు.
అనంతరం బీరువా ఓపెన్ చేసి అందులోని నగదు, నగలు తీసుకున్నట్లు బాదితురాలు ఎల్లయమ్మ వెల్లడించింది. ఆ తర్వాత హాల్లో నిద్రిస్తున్న ఆమె మనవడు కృష్ణ కాంత్ దగ్గరకు వచ్చి దాడి చేశారు. చేతుల కట్టి డైమండ్ రింగ్ ఉందని తీసుకున్నారు. వచ్చిన ముగ్గురు హిందీలో మాట్లాడుతున్నారని అతడు తెలిపాడు. వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న కారు తాళాలు తీసుకొని కారులో పారిపోయినట్లు వివరించాడు. ‘మా నాన్న హైదరాబాద్ వెళ్లారు. ఘటన జరిగిన వెంటనే నేను పోలీసులకు కాల్ చేశాను. వెంటనే పోలీసులు వచ్చి వెరిఫై చేశారు. బయట రాష్ట్రానికి చెందిన ముఠాగా అనిపిస్తోంద’ని మనవడు కృష్ణ కాంత్ పోలీసులకు తెలిపాడు. దీనిపై క్రైమ్ ఎస్ఐ మహరూఫ్ మాట్లాడుతూ ముగ్గురు దొంగలు హిందీలో మాట్లాడుతున్నట్టు బాధితులు చెప్పారు. ప్లాస్టిక్ వైర్లతో బంధించి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. సిపి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ ఆధారాలను సేకరిస్తుంది. సిపి ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నాం. కారు మారికవలస ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందింది. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో డైవర్ట్ చేసేందుకు లోకల్ గ్యాంగ్ కూడా హిందీలో మాట్లాడే అవకాశం లేకపోలేదు. సాధ్యమైనంత త్వరగా కేసును చేదిస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు.