
పట్నా: బీహార్ లో రాజకీయ పెనుమార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారని, బీజేపీ నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు దక్కనున్నాయని, నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2025 లో బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయు అధినేత నితీష్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనకు స్థాన భ్రంశం తప్పదనే అంశం ప్రచారంలో ఉంది. అయితే బీహార్ లో నితీష్ కుమార్ కు గల రికార్డు నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం జరగలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటి నుంచీ
పార్టీ వర్గాలలో ముఖ్యమంత్రి పదవి కాషాయం పార్టీ నేతకే దక్కాలనే భావన నలుగుతోంది. ప్రధాని మోదీ మాటకు కట్టుబడి బహిరంగ ప్రకటనలు చేయకుండా పార్టీ వర్గాలు సర్దుకున్నాయి. రాజ్యసభ స్థానానికి నితీష్ కుమార్ నామినేషన్ కోసం సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని జేడీ(యు) వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం అయ్యాయి. ముఖ్యమంత్రి సంతకం పెట్టడమే ఇక తరువాయి. మార్చి 5న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 1న నితీష్ కుమార్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.
మార్చి 16 తర్వాత సీఎం పదవికి నితీష్ రాజీనామా
రాజ్యసభ ఎన్నికలు మార్చి 16వ తేదీన జరుగనున్నాయి. అప్పటివరకూ ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తేదీ తర్వాత నితీష్ పదవి నుంచి వైదొలగవచ్చు. ఆయన రాజ్యసభకు వెళ్తే.. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణమాలు జరిగే అవకాశం ఉంది.
జేడీ(యు) శిబిరంలో కలకలం
ఈ పరిణామాల పట్ల జనతా దళ్ (యునైటెడ్ ) సమావేశంలో కలకలం చెలరేగింది. సీనియన్ నాయకుడు, మంత్రి విజేంద్ర ప్రసాద్ యాదవ్ సీఎంను కల్సి చర్చలు జరిపారు. మరో మంత్రి అశోక్ చౌదరి కూడా సిఎంని కలిశారు. అదే సమయంలో జేడీ(యు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా నితీష్ కుమార్ అధికార నివాసానికి చేరుకున్నారు. వేగంగా జరుగుతున్న పరిణామాల పార్టీలో సంచలనంగా మారాయి. రానున్న రాజ్యసభ నామినేషన్ల చుట్టూ చర్చోపచర్చలు సాగుతున్నాయి.
నిశాంత్ కుమార్ రాజకీయ
అరంగేట్రం ఛాన్స్
బీహార్ భవిష్యత్ ముఖ్యమంత్రి పై ఇప్పటికే సమాంతర చర్చలు మొదలయ్యాయి. బీజేపీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. అదే సమయంలో నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టవచ్చునని జేడీ(యు) వర్గాలు చెబుతున్నాయి. ఆయనను డిప్యూటీ సీఎం చేయవచ్చుననే ఊహాగానాలు ఉన్నా, అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.




