
పశ్చిమాసియాలో ప్రస్తుత పోరుతో ప్రాంతీయ సుస్థిరత, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అంతేకాకుండా విస్తృత స్థాయి ప్రాంతీయ యుద్ధం దశకు చేరుతోంది. ఇక ప్రపంచమార్కెట్లో ఇంధన మార్కెట్ కూడా కుదేలవుతుంది. దీనితో చమురు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి అగమ్యగోచరం అయ్యి, మార్కెట్లో ధరలు విపరీత స్థాయిలో పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం అయింది. ఈ ఘర్షణల ప్రాంతం రవాణా నౌకల సముద్ర యాన పరిధిలో ఉంది. దీనితో ముడిచమురు సరఫరాకు విఘాతం ఏర్పడుతుంది. పలు దేశాలలో తక్షణ అవసరాల ఇంధన కోటాకు గండిపడుతుందని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఇరాన్ అత్యధిక స్థాయి చమురు ఉత్పత్తి దేశంగా ఉంది. అమెరికా, ఒపెక్ ఆంక్షలు ఉన్నప్పటికీ చమురు రంగంలో ఇరాన్ పటిష్ట స్థితిలోనే ఉంది. ఈ దేశంపై జరిగే ఎటువంటి దాడుల ప్రభావం అయినా అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు.




