
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై 2వ తేదీన (సోమవారం) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాదనలు విననున్నారు.వారం, పది రోజుల్లో స్పీకర్ తీర్పు చెప్పే అవకాశం ఉంది. 12వ తేదీన సుప్రీం కోర్టులో స్పీకర్ ధిక్కరణ పిటిషన్పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ లోగా స్పీకర్ తీర్పు వెలువరిస్తారని కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలాఉండగా శనివారం కడియం శ్రీహరిని పిటిషనర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు. “ఇదిగో మీరు పార్టీ మారారు,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన వీడియోలు..” అని న్యాయవాది వీడియో చూపించారు. అవన్నీ కల్పితాలు, సృష్టించిన వీడియోలు అని కడియం బలంగా చెప్పారని తెలిసింది. గత వారం పిటిషనర్ వివేకానందను కడియం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ చేయగా, శనివారం కడియం శ్రీహరిని పిటిషనర్ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో న్యాయవాది కొన్ని వీడియోలు చూపించారు. ఆ వీడియోలో కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్న తన కుమార్తె కడియం కావ్యను గెలిపించాలని బహిరంగంగా ఓటర్లను కోరుతున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఆ వీడియోలు కల్పితమని కడియం బలంగా తన వాదన వినిపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసును సోమవారానికి వాయిదా వేశారు.




