
(మొదటి పేజీ తరువాయి)
సంఘటనల ఫొటోలను మంత్రి విలేకరులకు చూపించారు. దీంతోపాటు వెలుగుమెట్లలో పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కానీ, ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తామని, ఇందిరమ్మ ప్రభుత్వానికి పేదలే పెటెంట్ అని ఆయన అన్నారు. ఈవిషయంలో నిజంగా పేదలపై బిఆర్ఎస్ బావ మరుదులు, ఫాంహౌస్ లో ఉండి కుట్రలు చేస్తున్నారని, ఈ విషయంలో కెసిఆర్ వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుందన్నారు. వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కారణంగా బీటలువారిందని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో 168 టిఎంసిల నీరు ఇస్తామని చెప్పి అందులో 50 టిఎంసిల నీటిని సముద్రం పాలుచేశారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బిఆర్ఎస్కు ఎటిఎంగా మారిందన్న బిజెపి నేతలు నేడు బిఆర్ఎస్తో చేతులు కలిపారని ఆయన విమర్శించారు.
సిబిఐ స్పందించడం లేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిపై జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఈ కేసును అప్పగించినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించ లేదని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్ట్లను తాము పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్, కెటిఆర్, హరీష్రావులు వచ్చి మాట్లాడాలన్నారు. వారు గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, మేం కచ్చితంగా అవకాశం ఇస్తామని, వారు అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
ఉత్తర తెలంగాణకు బిఆర్ఎస్ అన్యాయం: మంత్రులు పొన్నం, వివేక్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. 196 టిఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టిఎంసీలకు పరిమితం చేసిందన్నారు. 50 టిఎంసీలు సముద్రంలో కలిపిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, తమ ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం ఇచ్చామని, కాళేశ్వరంపై చర్చించామని, కేంద్రం చర్యలు కోరామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా రూ.48వేల కోట్లు మిత్తీగా కట్టిందని, కేంద్రప్రభుత్వం ఇకనైనా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడినందును దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా ధనిక పార్టీగా మారిందన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయిల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని కెసిఆర్ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లు, కాసుల కోసమే బిఆర్ఎస్ అనుకూల నీటిప్రాజెక్టులను చేపట్టిందని ఆయన విమర్శించారు.




