
కామారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ ఎన్నికల్లో స్వత్రంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బిఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా, సమాన స్థానాలు గెలుచుకున్న ప్రతిపక్ష బిఆర్ఎస్ తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తే కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మెలికె పెట్టింది.
వైస్ చైర్ పర్సన్గా కాసర్ల గోదావరి అభ్యర్థితిత్వాన్ని బిఆర్ఎస్ ప్రతిపాదించింది. దీంతో ఇరు పార్టీ రాజీ కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్, బిఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ పదవులు పంచుకోవడం విశేషం. ఇలాంటి ఉదంతమే అదిలాబాద్లోనూ చోటుచేసుకుంది. అక్కడ స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరిగాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన అనంతరం తిరిగి కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవి దక్కించుకున్నారు.




