
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ విద్యార్థిని మృతి వెనుక కొరియన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రభావం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళ లోని కొచ్చికి చెందిన విద్యార్థిని (16) జనవరి 17న పాఠశాలకు వెళ్తున్నట్టు చెప్పి బయటకు వెళ్లిన తరువాత క్వారీలో శవమై కనిపించడం సంచలనం కలిగించింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖను గుర్తించారు. అందులో తన కొరియన్ ఫ్రెండ్ మరణంతో తీవ్ర వేదనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బాలిక పేర్కొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
బ్లాక్ వెనమ్ అని ఉన్న కొరియన్ ఇన్స్టా గ్రామ్ ఖాతా లోని ఫాలోవర్లను పట్టుకోడానికి ఆరా తీశారు. కానీ ఈ సంఘటన తరువాత ఆ ఫాలోవర్లు అదృశ్యమయ్యారని బయటపడింది. మృతురాలి ఫోన్ను పరీక్షించగా, ఒకే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పదుల సంఖ్యలో లాగిన్లు ఉన్నట్టు గుర్తించారు. చివరకు నకిలీ పేర్లతో లాగిన్ కావడంతో దోషులు ఎవరో తేలలేదు. టీనేజర్లను మానసికంగా ప్రభావితం చేసే ఖాతాలను విద్యార్థులు అనుసరించి ఉండవచ్చని భావిస్తున్నారు.




