
తమ పార్టీ టివికె ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం అయిందని పార్టీ అధినేత , హీరో విజయ్ తెలిపారు. తమ పార్టీ తరఫున వెలువరించిన అధికార పంపిణీ ప్రతిపాదన రాజకీయాల్లో బాంబు అయిందని వ్యాఖ్యానించారు. తమ ఫార్మూలా ఇప్పుడు పలు పార్టీల్లో ప్రచారం పొందింది. అన్ని కూటములు, పార్టీలు ఇప్పుడు టివికె వెంటపడేలా ఉన్నాయని , అసెంబ్లీ ఎన్నికలకు ముందే విజయ్ విజిల్ బాగా మోగుతోందని శుక్రవారం తెలిపారు. ఈ కొత్త పరిణామంతో ముఖ్యమంత్రి, డిఎంకె నేత స్టాలిన్ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయన తరచూ కాంగ్రెస్తో అధికార పంపిణీకి ససేమిరా అంటున్నారు.
ఇప్పుడు పద్ధతి మార్చుకోవల్సి వస్తోందని విశ్లేషించారు. సేలం సమీపంలోని బైపాస్లో భారీ సంఖ్యలో హాజరైన సభలో విజయ్ ప్రసంగించారు. తమిళనేల తొలి సైనికుడుగా నిలిచితీరే వ్యక్తిని అని, వెన్నుచూపడం కలలో కూడా లేదని ప్రకటించారు. డిఎంకెకు కూటమి అంటే కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే, అయితే తరువాత పరిపాలన విషయంలో వారి పంథా విడిగా ఇతర విషయాలపై ఉంటుందని స్టాలిన్పై విరుచుకుపడ్డారు. ఈ ఇతరాలను ఆయన డబ్బు అంటూ సంకేతాలతో తెలిపారు.
విజయ్ ర్యాలీలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి
సేలంలో విజయ్ సభ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి స్పృహ తప్పిపడిపోయాడు. కిక్కిరిసిన జనం మధ్య పడిపోయిన ఈ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుపుతూ ఉండగా మృతి చెందాడు. ఈ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37)గా గుర్తించారు. కొద్ది సంవత్సరాల క్రితం సేలంలో జవనోపాధికి వచ్చారు. ఇక్కడ ప్రాణాలొదిలాడు.




