
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారక్క జారతకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పెద్ద జాతర అని చెప్పుకుంటున్న ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం విడ్డూరమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన వేడుక జరగడం తెలంగాణకే తలమానికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడంబరాలు చేస్తోందని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడటం లేదన్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం శోచనీయమని, ఆడంబరాలతో గుర్తింపు రాదని ఎద్దేవా చేశారు.
మేడారం జాతరలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 30, 31 వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవు దినం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా జాతర జరిగే ప్రాంతాలలో ఆప్షన్ హాలిడే ఇవ్వడం, తర్వాత వచ్చే నెలలో రెండో శనివారం రద్దు చేస్తూ దానిని పని దినంగా నిర్వహించడం అనేది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇంటిల్లిపాది సమ్మక్క సారక్క తల్లులను కొలిచేందుకు తరలి వెళ్తున్నారని, ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా అధికారికంగా సమ్మక్క సారక్క వేడుకలకు సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.




