
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బావమరిది సృజన్ రెడ్డితో కలిసి ఆయన చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిబిఐI విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. మంగళవారం ఉదయం సిట్ విచారణకు వెళ్లే ముందు మీడియా సాక్షిగా హరీష్రావు లేఖను విడుదల చేశారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, సింగరేణిలో టెండర్లలో పాల్గొనడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని, ఈ విధానం సింగరేణి చరిత్రలో గతంలో లేదని లేఖలో పేర్కొన్నారు.
కోల్ ఇండియా లేదా వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ వంటి సంస్థలు కూడా దీనిని అనుసరించడం లేదని అన్నారు. గతంలో ఐఓసిఎల్ నుండి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేసి, ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు బదిలీ చేశారని తెలిపారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, అదనంగా జిఎస్టి భారం పడుతోందని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని లేఖలో వివరించారు. సింగరేణి బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మౌనంగా ఉండటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 2024 తర్వాత తీసుకున్న టెండర్లు, పాలసీ నిర్ణయాలన్నింటిపై విచారణ జరిపించాలని హరీష్రావు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని డిమాండ్ చేశారు.




