
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బిసి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దేవరకొండ భాగంలోని ఔట్ లెట్ సొరంగ మార్గం 20 మీటర్ల దూరం తవ్వకం పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. ఎస్ఎల్బిసి పునరుద్ధరణ పనుల పురోగతిపై శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నుంచి ఇన్ లెట్ సొరంగ మార్గం పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారని ఆయన వెల్లడించారు. అయితే సొరంగ మార్గం తవ్వకాల్లో భద్రతా చర్యలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. తవ్వకాల సమయంలో అవసరమైన ప్రసరణతో పాటు సొరంగ మార్గం తవ్వేటప్పుడు వచ్చే నీటిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు
భూ భౌతిక పరిస్థితిలకనుగుణంగా టన్నెల్ బోర్ మిషన్ (టిబిఎం) విధానాన్ని విరమించుకొని ఆధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సురక్షిత మార్గాలు అన్వేషించి అదనంగా వెంటిలేషన్, విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2025 ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్బిసి తవ్వకాల్లో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద ఘాటనను దృష్టిలో పెట్టుకొని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బిసిని పూర్తి చేసేందుకు రూపొంచిన ప్రణాళికలననుసరించి 24 గంటలు మూ డు షిఫ్ట్ల్లో పనులు చేపడుతున్నామన్నారు. నిర్ణిత గడువులోపు పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.




