
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బల్కంపేట ఎల్ల మ్మ దేవాలయాన్ని శుక్రవారం అట వీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువు రు అధికారులపై ఈ సందర్భంగా వే టు వేశారు. ముందస్తు అనుమతి లే కుండా విధులకు గైర్హాజరు కావడం వంటి తీవ్రమైన అంశాలను మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ల క్షం వహించిన నలుగురు సిబ్బందిని సేవల నుండి తొలగించాలని మంత్రి ఆదేశించారు. స్వీపర్ (ఔట్సోర్సింగ్) జి.రాము, అటెండర్ (రెగ్యులర్) ఎస్. శ్రీహరి, స్వీపర్ (ఔట్ సోర్సింగ్) పి. నరసింహ, సీనియర్ అకౌంటెంట్ (ఔట్సోర్సింగ్) జి.ప్రభాకర్ రావును విధుల నుండి తొలగించాలని నిర్ణయించారు. అర్చకుడు ఎ.శ్రీనివాసచార్యులపై ఛార్జిషీట్ మెమో జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే పరిపాలనా, పర్యవేక్షణ లోపాల కారణంగా దేవాలయ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని, తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ నిర్వహణ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. భక్తుల నుంచి వరుసగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దేవాలయానికి చేరుకున్న మంత్రి అక్కడి పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, భక్తులకు అందుతున్న సదుపాయాలు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. భక్తుల క్యూలైన్ల నిర్వహణ, ప్రత్యేక దర్శనాల వ్యవస్థ, టికెట్ జారీ విధానం, హుండీ లెక్కింపు ప్రక్రియ, ప్రసాదాల తయారీ పంపిణీ, అన్నదాన నిర్వహణ, శానిటేషన్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి నుంచి ప్రతీ దేవాలయాన్ని సందర్శిస్తారని, దేవాలయ భూములు ఇతరత్రా ఆస్తుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విరాళాలు, టికెట్ వ్యవస్థపై సమగ్ర విచారణ
విరాళాలు, ప్రత్యేక దర్శన టికెట్ల జారీ విధానంపై పారదర్శకత ఉండాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టికెట్ కౌంటర్లలో నగదు లావాదేవీలు కచ్చితంగా రికార్డుల్లో నమోదు చేయాలని, రోజువారీ లెక్కలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రిజిస్టర్లు, ఆన్లైన్ నమోదు వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ను సమీక్షించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, లెక్కింపు అనంతరం నగదు తక్షణమే బ్యాంకులో జమ చేయాలని మంత్రి ఆదేశించారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బంది హాజరు, విధివిధానాలు, లెక్కల సమగ్ర నివేదికను సమర్పించాలని అన్నారు. దేవాలయంలోని బంగారు నిల్వల భద్రతపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలని, ఫుటేజ్ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భక్తుల రద్దీ సమయంలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని తెలిపారు. గతంలో వచ్చిన రూ.16.5 లక్షల విరాళాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.




