
మన తెలంగాణ/హైదరాబాద్: వాస్తవాలు ఒప్పుకో అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై శుక్రవారం బిఆర్కె భవన్ వద్ద కవిత మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించగా, మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పరాజయంపాలైంద న్న కెటిఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కె టిఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును చూశానని, తనపై పెట్టిన కేసు వల్లే బిఆర్ఎస్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులను మార్చకుండా దోపిడీదారులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వడం, అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి ఓటమికి కారణమని కెటిఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును వారికి అనుకూలంగా మార్చుకుని మాట్లాడటం సరికాదని అన్నారు. బిఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తన తప్పు తేలకుండానే సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బిఆర్ఎస్ తనకు ఎలాంటి అండగా నిలబడలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నేతలు ప్రజల తీర్పును గౌరవించాలని కెటిఆర్కు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి తానేనే కారణమా సమాధానం చెప్పాలని బిఆర్ఎస్ నేతలను నిలదీశారు.
కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు.ఈ కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. తన కుటుంబానికి దూరమై, 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నానని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు రాలేదన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరమన్నారు.
‘సత్యమేవ జయతే’: ఎక్స్లో కవిత
మద్యం కేసులో కోర్టు తీర్పు అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అని ఆమె ఎక్స్లో పోస్టు చేశారు.




