
తొలి విడత ఇప్పటికే రూ.259.36 కోట్లు విడుదల
తాజా విడతతో కలిపి మొత్తం విడుదలైన నిధులు రూ.646.36 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.646.36 కోట్లు తెలంగాణకి అందించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం సుమారు రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
గ్రామాల సమగ్రాభివృద్ధి, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని మంత్రి తెలిపారు.




