
‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ’ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. అనుదీప్ మీడియాతో మాట్లాడుతూ “విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘జాతిరత్నాలు’తో పోలిస్తే ’ఫంకీ’ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. ‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇందులో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి. ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇక మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నాను. అలాగే వెంకటేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను” అని అన్నారు.




