
మన తెలంగాణ / హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆర్టిసి జెఎసి ప్రకటించింది. సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జెఎసి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి హాజరై ప్రసంగిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఆర్టిసి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత రెండున్నర సంవత్సరాల నుండి జెఎసి ఆధ్వర్యంలో పలు ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానంగా ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని, 2021 వేతన సవరణ అమలు చేస్తామని, ఆర్టిసిని విస్తరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏ ఒక్కటీ అమలు చేయకుండా వాటిని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.ఆర్టిసి కార్మికులపై ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి విపరీతమైన పనిభారాలు మోపిందని, రోజుకు 16 గంటలు బలవంతంగా డ్యూటీలు చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వంపై కార్మికుల్లో రోజు రోజుకూ అసంతృప్తి, వ్యతిరేకత తీవ్రరూపం దాలుస్తోందని, అందులో భాగంగా ఈరోజు జెఎసి నాయకత్వం ఫిబ్రవరి 24న “ఛలో సెక్రటేరియట్” కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని తెలిపారు. కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి పెద్దయెత్తున తరలివచ్చి “ఛలో సెక్రటేరియట్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఎన్ కృష్ణ-ఎన్ ఎంయు, జె.రాఘవులు- ఈయు, ఎన్.బాల్ రెడి ్డ-ఈయు, ఎన్.బుద్ధ విశాల్- బికెయు, ఎం.ఎ.మజీద్ -ఈయు, డి. రాంచందర్-బిడబ్ల్యుయు, పాపయ్యగౌడ్, ము త్యాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




