
మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింలను కాల్చుతున్నట్లుగా ఉన్న హింసాత్మక వీడియో నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. హిమంతపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా దురుద్దేశపూర్వకంగా ఈ వీడియోను పోస్టు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అసోం ముఖ్యమంత్రి రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు. ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు అసదుద్దీన్ సిపికి రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. హిమంత బిశ్వ శర్మ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, బహిరంగ ప్రసంగాలు, ఇతర వేదికల ద్వారా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నిరంతరం ప్రకటనలు చేస్తున్నారని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానన్నారు. అలాంటి అనేక ప్రసంగాలు ఇప్పటికీ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.




