
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు 30 శాతం మంది భక్తులు ఎక్కువగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 8న ఉదయం శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం జరుగుతాయి. ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.
15న మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ : టిటిడి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గంటల నుండి అర్థరాత్రి 12 గం=టల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.




