
పురుషుల అండర్19 వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా యువ జట్టును ఓడించి తుది పోరుకు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన థామస్ 14 ఫోర్లు, ఒక సిక్సర్తో 110 పరుగులు చేశాడు. కాలెబ్ ఫాల్కనర్ (40), ఫర్హాన్ అహ్మద్ (28), జోసెఫ్ (25), మేయ్స్ (24) పరుగులు చేసి తమవంతు సహకారం అందించారు.
తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఒలివర్ పీక్ అద్భుత సెంచరీ సాధించినా ఫలితంలేకుండా పోయింది. దూకుడుగా ఆడిన ఒలివర్ 88 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సమన్వయంతో ఆడిన ఓపెనర్ నితేశ్ శామ్యూల్ (47) పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆర్యన్ శర్మ (34) ఒక్కడే కాస్త రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మోర్గాన్, జేమ్స్, అల్బర్ట్ తలో రెండేసివికెట్లను పడగొట్టారు.




