
కేంద్ర ప్రభుత్వం ‘నగర్ వన్ యోజన’ కింద మరో ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను రాష్టంలో జనవరి 2026 నాటికి ఏర్పాటు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. వీటిని ఆదిలాబాద్ జిల్లాలోని మవాల, యాల్గోర్ -2, మంచిర్యాలలోని ఇందరం, చెన్నూర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని యెల్లంపేట్, చెంగిచర్లలో అభివృద్ధి చేయనున్నారు. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరాల్లో పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఉద్దేశించి ‘నగర్ వన్ యోజన’ కింద ఈ ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. అయితే అంతకుముందు, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నాగారం, పాలెగడ్డ వంటి ఆరు పార్కులను హరితహారం కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద ఈ నిధులు మంజూరు చేసింది.
పట్టణాల పరిధిలో అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటు ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడమే నగర్ వన్ యోజన పథకం ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. నగర్ వన్ యోజన కింద ఏర్పాటయ్యే అర్బన్ ఫారెస్ట్లో స్థానిక చెట్లకు ప్రాధాన్యం ఇస్తూ విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతుంది. 2025-.26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నగర్ వన్ యోజన కింద రాష్ట్రానికి రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తొలివిడతలో భాగంగా 70 శాతం నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ అర్బన్ ఫారెస్టు ఏర్పాటు వల్ల పట్టణాల్లో హరిత వాతావరణం విస్తరించడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. నగర్ వన్ యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే దిశగా ఈ అర్బన్ ఫారెస్ట్లు పథకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర అటవీ అధికార వర్గాలు చెబుతున్నాయి.




