
బెంగళూరు : కర్నాటక సిఎం పదవి పంపకాలపై ఉత్కంఠ వీడడం లేదు. తాజాగా డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం నేతలతో ఢిల్లీలో వరుస భేటీల అనంతరం బెంగళూరు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పదలుచుకున్నా’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాయకత్వ వివాదంపై హైకమాండ్ తప్పనిసరిగా ఒక నిర్ణయానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరుడు, ఎంపి డికె సురేశ్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, 140 మంది శాసనసభ్యులతో పాటు సిఎం కూడా మద్దతునిస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీతో పాటు హైకమాండ్ ముందు తాను, సిఎం ఏం మాట్లాడుకున్నామో అది మాకు మాత్రమే తెలుసునని, పార్టీ చూసుకుంటుందన్నారు. ఆ విషయాలు మీడియాతో చర్చించదలుచుకోలేదన్నారు. అనవసర గందరగోళానికి మీడియా పాల్పడుతోందన్నారు. నాయకత్వం అంశంపై అనవసర ఊహాగానాలు చేయవద్దని హితవు పలికారు. రాహుల్ గాంధీతో పాటు హైకమాండ్ నేతలతో అసలు తాను భేటీ కాలేదన్న వార్తలను శివకుమార్ ఖండించారు. సంబంధిత ఫొటోలను ఎఐసిసినే విడుదల చేసింది కదా అని గుర్తు చేశారు.




