
మన తెలంగాణ/హైదరాబాద్ః “సమాజంలో చైతన్యం తేవడంతో పాటు రాజకీయాల్లో సమూలమైన మార్పు కోసం వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో మా పార్టీలో చేరాలి..” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. డాక్టర్ సాయి చంద్ర నాయకత్వంలో ఆదివారం పలువురు డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, పారా మెడికల్ నిపుణులు, ఫార్మాస్యూటికల్ రంగంలో పని చేస్తున్న ప్రముఖులు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ దేశ రాజకీయాల్లో విద్యావంతులు, మేధావులు బిజెపిలో చేరాల్సిన అవశ్యకత ఉందన్నారు. గతంలో రాజకీయాలు అంటే కేవలం డబ్బు ఉన్న వారో, అంగ బలం ఉన్న వారో మాత్రమే వస్తారని అనుకునే వారని, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. ఇప్పుడు దేశ ప్రజలు బిజెపి సిద్ధాంతాల పట్ల, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు.
దేశాన్ని కాపాడగల నాయకుడు ఎవరు?, దేశ సమస్యలను పరిష్కరించగల సత్తా ఉన్న పార్టీ ఏదీ?, దేశ ద్రోహి శక్తులు ఎందుకు పెరుగుతున్నాయి ?, వాటని ఎలా ఎదుర్కొవాలి ? ఈ ప్రశ్నలన్నీ ప్రతి ఒక్కరిలో మెదులుతున్నాయని అన్నారు. ఇటీవల పలు విశ్వ విద్యాలయాల్లో ఆఫ్జల్ గురును హీరో చిత్రీకరించడం, దేశ న్యాయ వ్యవస్థను అవమానించడం, జెఎన్యూ వంటి సంస్థల్లో కొంత మంది ప్రధాని నరేంద్ర మోడీపై, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అవహేళనకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇంకా ఆర్ఎస్ఎస్పై ద్వేషపూరితంగా మాట్లాడడం, దేశ విరోధ నినాదాలు వినిపించడం వంటి పరిణామాలతో దేశ ప్రజలు తీవ్రంగా కలవరపడ్డారని ఆయన చెప్పారు. ఈ విధమైన దేశ విరోధి శక్తులను ఎదుర్కొవాలంటే దేశాన్ని ప్రేమించే, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు కూడా సంఘటిత శక్తిగా రాజకీయాల్లోకి రావాల్సిన అవశ్యకత ఉందని రాంచందర్ రావు తెలిపారు.
తొండలు వదులుతా?, తోలు తీస్తా? అంటారా?
ప్రధాన పార్టీలు ప్రజలకు తమ విధానాలను చూపించలేక, బూతుల రాజకీయాలతోనే కాలం గడుపుతున్నాయని ఆయన విమర్శించారు. ఒకరు ఫ్యాంటులోకి తొండలు వదులుతా, ఫ్యాంటు విప్పుతా అంటే, మరొకరు తోలు తీస్తా అన్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా మాట్లాడితే రాజకీయాలు రాబోయే తరానికి తీవ్ర ప్రమాదకరంగా మారుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు అంటే వ్యక్తిగత దూషణలు కాదు, కొట్టుకోవడం కాదన్నారు. రాజకీయాలకు ఒక గౌరవం ఉండాలి, విలువ ఉండాలన్నారు. ప్రజల సమస్యలపై మట్లాడే పరిపక్వత ఉండాలంటే, మార్పు రావాలంటే విద్యావంతులు, మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని రాంచందర్ రావు అన్నారు.




