
కువైట్ సిటీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్ లోని ఓ న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. మాదక ద్రవ్యాలతో పట్టుబడిన ఇద్దరు భారతీయులను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. అయితే వారిద్దరూ భారత్లో ఏ రాష్ట్రానికి చెందిన వారనే విషయంపై స్పష్టత లేదు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ ఇటీవల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
ఇందులో భాగంగా కైఫాన్, సువైఖ్ ప్రాంతాల్లో నిఘా పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇద్దరు భారతీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలినట్టు సమాచారం.




