
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరోగా వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి నటించిన మాస్ సాంగ్ను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. కాగా తాజాగా ఈ పాటను గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ ఈవెంట్ కి చిత్ర తారాగణం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నయనతార, కేథ్రిన్ థ్రెసా, సునీల్, విటివి గణేష్, రేవంత్, హర్షవర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం తదితరులు నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది.




