
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో తట్ట మన్ను తీయలే, చూసుకోని ముర్వ చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదని అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించయారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు తద్వారా చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయని చెప్పారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పుచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్రెడ్డి ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు, అభివృద్ధి పనులు పక్కనపెట్టారని, రైతులను గాలికి వదిలి పంటలను వాటి కర్మానికి వదిలేశారని మండిపడ్డారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పి బ్రోకర్ల అవతారం ఎత్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగిందని, అయితే కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది – 0.76 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.




