
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ’మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ “రవితేజలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు.
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. రవితేజ ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ జాతర చూడబోతున్నాం. మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “శివుడు పాత్ర చేసిన నవీన్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. మాస్ జాతర చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు”అని తెలిపారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. “నా కథ నచ్చి రవితేజ నాకు అవకాశమిచ్చారు. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, భీమ్స్ సిసిరోలియో, శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, విధు అయ్యన్న, శ్రీనాగేంద్ర తంగాల తదితరులు పాల్గొన్నారు.




