
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, నిర్మాత సురేశ్ బాబుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో తప్పనిసరిగా తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నవంబర్ 14న పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేష్, రానా, అభిరామ్తో పాటు నిర్మాత దగ్గుబబాటి సురేష్పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.
ఇది కేసు నేపథ్యం
దక్కన్ కిచెన్ లీజు విషయంలో హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మద్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్లోని వెంకటేష్కు చెందిన సంస్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో హోటల్ యజమాని కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని హోటల్ యజమాని పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని కోర్టుకు చెప్పారు. బాధ్యులపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేశారు.




